ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దిండిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బొత్స తానే ఏపీ ముఖ్యమంత్రి అన్నట్టుగా మాట్లాడుతున్నారని పవన్ దుయ్యబట్టారు. గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి బొత్స అని అన్నారు. రాష్ట్రం విడిపోతే తప్పేంటని బొత్స అన్నాడని పవన్ ఆరోపించారు.రాజధాని అమరావతిని తరలించడం కుదరదని, గత ఐదేళ్లలో అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని వ్యాఖ్యానించారు.
పర్యావరణ హిత రాజధాని నిర్మాణమే తమ అభిమతమని జనసేనాని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి తరలించాలని తామెప్పుడూ వ్యాఖ్యానించలేదని చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే తాము స్పష్టం చేశామని వివరణ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశం చాలా చిన్నదని, కశ్మీర్, తెలంగాణ సమస్యలతో పోల్చితే అదేమంత పెద్దది కాదని అన్నారు. ఎన్నికల్లో 151 సీట్లు గెల్చిన పార్టీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని సులువుగా పరిష్కరించగలదని పేర్కొన్నారు.

