తెలంగాణలో రేపటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు లక్కీడ్రా ద్వారా షాప్ యాజమానుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. 2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించడంతో మద్యం దుకాణాలను సొంతం చేసుకొనేందుకు పోటీపెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 2,216 దుకాణాలకు 48,784 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.