గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి దాదాపు మూడున్నర గంటలపాటు కేశినేని నివాసంలో వల్లభనేనితో చర్చించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి.
కానీ వంశీ టీడీపీలో కొనసాగేందుకు సుముఖత చూపలేదు. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ తో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా వంశీ చర్చలు జరపడంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ సందేహాలకు వంశీ ఫుల్ స్టాప్ పెట్టారు. వైసీపీలో చేరబోతున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.