దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేయడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ఈ రోజు ఉదయం ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోవడంతో పొగమంచు నగరాన్ని కప్పేసింది. లైట్లు వేసినా 25 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపడని పరిస్థితి నెలకొంది.
పగలు కూడా రాత్రిని తలపిస్తుండడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా నడుస్తుండడంతో ట్రాఫిక్ జాం అవుతోంది. ఐదు విమానాలను విమానాశ్రయం అధికారులు దారిమళ్లించారు. 22 రైళ్లు ఇప్పటికే 8 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.