తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ రథం గత రాత్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్స్పందించారు. 60 ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ఉపయోగిస్తున్న రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.
దేవాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న వైసీపీ పాలనలో లక్ష్మీనరసింహుడి రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని పండితులు అంటున్నారని లోకేశ్ వెల్లడించారు.
ఓవైపు గోశాలలో గోవుల మృత్యుఘోష వినిపిస్తుంటే, మరోవైపు రోజుకొక ఆలయంలో అరిష్ట సంకేతాలు వెలువడుతున్నాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు. రథం దగ్ధం కావడానికి కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.