ఈ ఎన్నికల్లో మోదీ హవా ఉండదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రేసేతర కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అయన తెలిపారు. గత ఎన్నికల్లో మాదిరి మోదీ ప్రభంజనం ఉండదని పేర్కొన్నారు. ప్రజలు ప్రభంజనాన్ని పట్టించుకోకుండా వారికి నచ్చిన వ్యక్తినే ఎన్నుకుంటారని, అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉందని అన్నారు. కేసీఆర్ ఏర్పాటుచేసే కాంగ్రేసేతర, బీజేపీయేతర కూటమిలో ఎంఐఎం కచ్చితంగా పాలుపంచుకోబోతోందని వెల్లడించారు.
ప్రాంతీయ పార్టీల్లో ప్రధాని మోదీ కంటే సమర్థులైన నాయకులున్నారని అన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే బీజేపీ దేశ భద్రతను తెరపైకి తెస్తోందని విమర్శించారు. ఈసారి మాత్రం బీజేపీ ఇచ్చే తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ధ్వజమెత్తారు. కొన్ని రోజులు సర్జికల్ స్ట్రైక్స్ని ప్రచారంలోకి తెచ్చారని, తర్వాత బాలాకోట్ దాడులను తెరపైకి తెచ్చారని ,తాజాగా మిషన్ శక్తిని ప్రచారంలోకి తెచ్చి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని ఘాటుగా విమర్శించారు.

