telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైనైడ్”లో మరో ఇద్దరు ప్రముఖ నటులు

Cyanide

మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి ఆపై గర్భనిరోధక మాత్రలను ఇచ్చి, నమ్మించి సైనైడ్‌ ఇచ్చి చంపేసిన మోహన్ అనే సైకో కిల్లర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన మోహన్ ఏకంగా 2003 – 2009 కాలంలో ఏకంగా 20 మంది మహిళలను కనికరం లేకుండా చంపేశాడు. న్యాయస్థానం అతడికి ఆరు మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధించింది. ఈ కేసు ఆధారంగా దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ ‘సైనైడ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్‌ ఇండియా మూవీగా ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ప్రియమణి నటించనున్నారు. హిందీలో ఆ పాత్రను యశ్‌పాల్‌ శర్మ పోషిస్తారని దర్శకుడు రాజేశ్‌ తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ వెల్లడించారు. తనికెళ్ల భరణి, సమీర్‌, రోహిణి, చిత్రంజన్‌ గిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జార్జ్‌ జోసెఫ్‌ సంగీతం అందించనున్నారు.

తాజాగా మిడిల్ ఈస్ట్ సినిమా పై.లి. అధినేత ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ “సైనైడ్ సినిమాకు ప్రారంభం నుంచే మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ‘నా బంగారు తల్లి’ చిత్రం ద్వారా ఆయన నంది అవార్డు అందుకున్నారు. అలాగే, కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండు సార్లు కర్ణాటక రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న రంగాయన రఘు… కేరళ రాష్ట్ర పురస్కార గ్రహీత, పలు మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన మణికంఠన్ ఆచారి, మలయాళంలో దాదాపు 150 సినిమాలలో నటించిన శ్రీజిత్ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ ఈ సినిమాలో నటించనున్నారు. అంతే కాకుండా… ‘మహర్షి, ఊపిరి, పంజా, గజని, ఫా, స్పెషల్ ఛబ్బీస్’తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే సినిమాలకు, ‘ఉరిమి, మామాంగం, పడిసి రాజా’ లాంటి హిస్టారికల్ చిత్రాలను కలుపుకొని దాదాపు వెయ్యి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించి కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత సునీల్ బాబు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో దాదాపు ఐదు సెట్లు నిర్మించాల్సి ఉంది. మా సినిమాలో సెట్స్ కున్న ప్రాముఖ్యతను ద్రుష్టిలో పెట్టుకొని సునీల్ బాబును ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంపిక చేశాం” అన్నారు.

ఈ సందర్భంగా ప్రైమ్ షొో ఎంటర్ టైన్మెంట్ అధినేత కే నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “ప్రవాసాంధ్రులైన మేము సినిమాల మీదున్న ఆసక్తితో తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ… దేశ వ్యాప్తంగా చక్కటి సినిమాలను నిర్మించాలనే ఉద్ధేశ్యంతో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థను స్థాపించాం. ప్రియమణితో రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న ‘సైనైడ్’ చిత్రం కథ మమ్మల్ని బాగా ఇన్ఫైర్ చేసింది. మేము ఎటువంటి సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నామో… అటువంటి లైనులో ఈ సినిమా కథ ఉండటంతో మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై.లితో కలిసి నిర్మించడానికి ముందుకొచ్చాం. సైనైడ్ మోహన్ కేసును అందరూ పేపర్ లో చదివే ఉంటారు. కానీ, రాజేష్ టచ్ రివర్ తీసుకున్న పాయింట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. ఒక కథను ఇలా సరికొత్త స్క్రీన్ ప్లేలో చెప్పడం, తెలుగులో ఇదే తొలిసారి కావొచ్చేమో” అని అన్నారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హిందీలో ఇదే పోలీసాఫీసర్ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. బెంగళూరు, మంగళూరు, మైసూర్, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ కీలకమైన షూటింగ్ ప్రదేశాలలో షూటింగ్ కొనసాగుతుంది .

Related posts