గోదావరిలో 3 వేల టీఎంసీల నీటి వరద ఉందని… ఏపీ ప్రాజెక్టులు కట్టుకున్నా తెలంగాణకు ఎలాంటి సమస్య ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమను రతనాలసీమ చేస్తానని… బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే… ఈరోజు వాళ్లు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరు అడుగులు పెరిగాడే కానీ…. అర అంగుళం మెదడు కూడా పెంచుకోలేదని ఎద్దేవా చేశారు.
అర్థపర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటుకోవాలనుకుంటున్నారని విమర్శించారు.
నీటి పారుదల అంశాలపై నిన్న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సమావేశమయ్యారని… ఏ అంశాలపై చర్చ జరిగిందో స్వయంగా సీఆర్ పాటిల్ చెప్పినప్పటికీ హరీశ్ రావు పిచ్చి వాగుడు వాగుతున్నారని మహేశ్ కుమార్ దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏయే అంశాలపై మాట్లాడారో వివరంగా చెప్పారని… ఇవేవీ హరీశ్ రావు మెదడుకు ఎక్కినట్టు లేవని అన్నారు.
తెలంగాణకు అడ్డగోలుగా ద్రోహం చేసిన మీరే ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ మీద, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు రావాలని సవాల్ విసిరారు. నువ్వు, మీ మామ కేసీఆర్ వచ్చి మీ వాదనలు వినిపించాలని అన్నారు.
ప్రెస్ మీట్లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే ప్రజలు నమ్మరని చెప్పారు.

