మద్రాస్ హైకోర్టు, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హెచ్చరికలు జారీచేసింది. కొడనాడు ఎస్టేట్ హత్యల మిస్టరీపై స్టాలిన్ మాట్లాడకుండా ఉంటేనే ఆయన బెయిల్ కొనసాగుతుందనీ, లేదంటే బెయిల్ ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కొడనాడులో ఓ ఎస్టేట్లో దిగవంత సీఎం జయలలిత ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత ఇక్కడి నుంచి కూడా పాలన సాగించేవారు. అయితే ఆమె మరణం అనంతరం ఈ ఎస్టేట్ లో గతేడాది ఏప్రిల్ 24న దొంగతనం జరిగింది.
ఈ సందర్భంగా దుండగులు సెక్యూరిటీ గార్డును కిరాతకంగా హత్య చేశారు. ఈ దోపిడీని సీఎం ఎడపాటి పళనిస్వామి చేయించారని స్టాలిన్ ఆరోపించడంతో పళనిస్వామి మద్రాస్ హైకోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ కొడనాడు ఎస్టేట్ పై వ్యాఖ్యలు చేయరాదనీ, ఒకవేళ చేస్తే ఇప్పటికే మంజూరు చేసిన బెయిల్ రద్దు అవుతుందని హైకోర్టు హెచ్చరించింది.