మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఎన్నికల సంఘం వారు ఇంటికి తీసుకెళ్లారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. మంచు ఫ్యామిలీ కనుసన్నల్లో ఎన్నికల అధికారులు పనిచేశారని.. రూల్స్ ఎన్ని అతిక్రమించాలో అంత జరిగిందని ఆవేదనతో మూకుమ్మడి రాజీనామాలు చేసి మరి ఆరోపించారు.
తాజాగా ఈ ఆరోపణలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించిన అధికారి కృష్ణ మోహన్ ప్రకాష్ రాజ్ ప్యానల్ చేస్తున్న ఆరోపణలని ఖండిస్తూ.. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు.ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లను ఒక బాక్స్లో లెక్కించనివి మరో బాక్స్లో పెట్టి తాళం వేశామని స్పష్టం చేశారు. వాటిని పోలింగ్ కేంద్రంలోనే రాత్రంతా ఉంచామని స్పష్టం చేశారు. తన చేతిలో ఉన్నవి తాళాలు, ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాసుకున్న కాగితాలు మాత్రమేనని కృష్ణమోహన్ వివరించారు.
ఈసీ సభ్యురాలిగా అనసూయ గెలుపు, ఓటములను కౌటింగ్ రోజు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు. సామాజిక మాద్యమాల్లో ఆమె గెలుపుపై వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని కృష్ణమోహన్ చెప్పారు. అనసూయ ఓట్ల లెక్కింపు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు.
28 ఏళ్ల ‘మా’ చరిత్రలో తాను ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు నిర్వహించానని, ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని కృష్ణమోహన్ తెలిపారు. బుధవారం నుంచి ‘మా’ అసోసియేషన్లో ఎన్నికలకు సంబంధించిన తన పని పూర్తైందని, ఇకపై అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు, తన కార్యవర్గ సభ్యులే ‘మా’ అసోసియేషన్ కార్యకలాపాలు చూసుకుంటారని వెల్లడించారు.