telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లవ్ స్టోరీ” షూటింగ్ ప్రారంభం… 15 రోజులపాటు లొకేషన్ లోనే చిత్రబృందం

అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలల పాటు తాత్కాలికంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో చివరి షెడ్యుల్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. 15 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేసి సినిమా చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో పాటను చిత్రీకరిస్తున్నారు.

సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ వల్ల వాయిదాపడిన మా సినిమా షూటింగ్‌ను ఈరోజు నుంచి మళ్లీ మొదలుపెట్టాం. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అన్నీ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నాం. లొకేషన్‌లో కేవలం 15 మంది ఉండేలా చూసుకుంటున్నాం’’ అని చెప్పారు. షూటింగ్‌లో పాల్గొనేవారందరికీ ముందే కరోనా టెస్ట్‌లు నిర్వహించామని నిర్మాతలు వెల్లడించారు. వాళ్లంతా షెడ్యూల్ కంప్లీట్ అయ్యేదాకా ఇంటికి వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. మాస్కులు, శానిటైజర్‌లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం అని తెలిపారు. 15 రోజుల పాటు నాన్ స్టాప్‌గా షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేస్తామన్నారు. సరైన సమయం చూసుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Related posts