టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ ఇంటి ముందు బాధిత కుటుంబం ధర్నాకు దిగింది. నరసరావుపేటలోని ఆయన నివాసం వద్ద తమ నుంచి వసూలు చేసిన రూ.7 లక్షలను వెనక్కి ఇచ్చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురిని మోసగించి, బెదిరించిన ఘటనల్లో శివరామ్ పై పలు కేసులు నమోదయ్యాయి.
తాజాగా నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా కలక్టరేట్ లో అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయని కోడెల శివరామ్ చెప్పాడన్నారు.ఆ ఉద్యోగం ఇప్పించాలంటే రూ.7 లక్షలు ఇవ్వాలని శివరామ్ చెప్పడంతో అంత మొత్తం సమర్పించుకున్నట్లు వెల్లడించారు. అయితే డబ్బులు తీసుకున్న శివరామ్ ఉద్యోగం ఇప్పించకుండా తిప్పుకుంటూ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా తమ నగదును తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.