ఉత్తర్ప్రదేశ్ వారణాసి పట్టణంలో రూ.339 కోట్ల తో నిర్మించిన ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీ కలల ప్రాజెక్టు అయిన కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్ను దేశ ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..అద్భుత నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ సమయంలో కూడా ఇక్కడ పనులు నిలిచిపోలేదని అన్నారు. ఇందుకోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్టుగా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం శ్రమించిన యూపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను మోదీ అభినందించారు.
ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని మోదీ కొనియాడారు.”ఎందరో ఆక్రమణదారులు వారణాసిపై దండెత్తారు. ధ్వంసం చేయాలని చూశారు. ఔరంగజేబు కుట్రలు, దురాఘాతాలను చరిత్ర చెబుతోంది. కత్తి పట్టుకొని.. వారణాసిని మార్చేద్దామనుకున్నాడు. మతోన్మాదంతో సంస్కృతిని అణచివేసే ప్రయత్నం చేశాడు అని అన్నారు.కానీ ప్రపంచం కంటే భారతనేల భిన్నమైంది. ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వస్తే.. అక్కడ మరాఠా యోధుడు శివాజీ కూడా పుట్టుకొచ్చాడు అని అన్నారు.

కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి పొందుతారని మన పురాణాలలో చెప్పబడింది. భగవంతుడు విశ్వనాథుని ఆశీస్సులు, ఒక అతీంద్రియ శక్తి ఇక్కడికి రాగానే మన అంతరంగాన్ని మేల్కొల్పుతుంది. ఈనాటి కార్యక్రమంతో గంగా నది ప్రసన్నమైందని మోదీ అన్నారు. విశ్వనాథ్ ధామ్ యొక్క ఈ సరికొత్త సముదాయం కేవలం ఒక గొప్ప భవనం మాత్రమే కాదు. ఇది మన భారతదేశ సనాతన సంస్కృతికి ప్రతీక.. ఇది మన ఆధ్యాత్మిక ఆత్మకు చిహ్నం.. ఇది భారతదేశ ప్రాచీనతకు, సంప్రదాయాలకు ప్రతీక.

ఇందుకోసం సోమవారం ఉదయం వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రజలు కూడా పూల వర్షం కురిపిస్తూ మోదీకి ఘన స్వాగతం చెప్పారు. తొలుత ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తరువాత లలితా ఘాట్ నుంచి రవిదాస్ ఘాట్కు మోదీ బోట్లో ప్రయాణించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి కాశీ విశ్వనాథ్ నడవా అభివృద్ధి పనులను జాగ్రత్తగా పరిశీలించారు. అనంతం గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ ఆలయంలో కూడా ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తరువాత కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ తొలి దశను ప్రారంభించిన అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. మోదీకి ఎదురుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ప్రధాని కొద్దిసేపు అక్కడ ఉన్న కార్మికులతో ముచ్చటించారు. వారికి అభివాదం చేశారు.

అలాగే కాశీ విశ్వనాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణంలో పలు వరుసల్లో కూర్చొన్న కార్మికులపై పూలు చల్లారు. ప్రతి ఒక్కరిపై పూలు పడేలా అన్ని వైపుల కలియతిరిగారు. అనంతరం వారితో కలిసి మోదీ ఫొటో దిగారు.


