“క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు.
క్వాంటం టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ-రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ, అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజెంటేషన్ ద్వారా క్వాంటం ప్రోగ్రామ్లోని కీలక అంశాలను వివరించిన సీఎం, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు, అదే తరహాలో ఇప్పుడు క్వాంటం రంగంలోనూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు.
అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే, భారత్కు క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉందని, క్రీస్తుపూర్వం 2500 నాటికే అర్బన్ ప్లానింగ్, జీరో ఆవిష్కరణ, అడ్వాన్స్డ్ అస్ట్రానమీ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికి దారి చూపిందని వివరించారు.
ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా భారత్దేనని, ‘బంగారు పిచ్చుక’గా పేరొందిన దేశం ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు.
హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం తర్వాత టెక్నాలజీ ఆధారిత సేవల రంగంలో భారత్ విప్లవం సాధించిందని చెప్పారు.
గూగుల్కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్కు సత్య నాదెళ్ల, ఐబీఎంకు అరవింద్ కృష్ణ వంటి భారతీయులే నాయకత్వం వహించడం దేశ ప్రతిభకు నిదర్శనమన్నారు.
ఏపీ అభివృద్ధి ప్రణాళికలను వివరించిన సీఎం, అమరావతిని నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా, విశాఖను డేటా సెంటర్ల గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
వచ్చే రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి ప్రారంభిస్తామని, లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే క్వాంటం స్కిల్ ప్రోగ్రామ్కు 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం యువత ఆసక్తికి నిదర్శనమన్నారు.


ఈసీని నిందించడం సరికాదు.. చంద్రబాబుకు పురందేశ్వరి హితవు