కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ షాక్ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల విద్యుత్ వినియోగాన్ని కలిపి లెక్కించడంతో స్లాబులు మారిపోతున్నాయని అన్నారు. దీనివల్ల ప్రజలపై మూడు రెట్ల అధిక భారం పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
సాధారణంగా 100 యూనిట్ల స్లాబులో ఉండే వినియోగదారులు ఇప్పుడు 300 యూనిట్ల స్లాబులోకి వచ్చారని వివరించారు. విద్యుత్ చార్జీల మదింపుతో పేద, మధ్య తరగతి ప్రజల జేబుకు ప్రభుత్వం చిల్లు పెడుతోందని తన లేఖలో ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా చూస్తూ ఊరుకోబోమని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.