telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“భారత్ తన 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది”: నారా చంద్రబాబు నాయుడు

ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి టెక్నాలజీని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకోవడమే సుపరిపాలన లక్ష్యం.

భవిష్యత్ తరాలకు సురక్షితమైన, అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని అందించడమే మా కర్తవ్యం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐవోడీ) పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, తన ప్రభుత్వ విజన్‌ను, భవిష్యత్ కార్యాచరణను ఆవిష్కరించారు.

1990లలో ఐటీ రంగం భవిష్యత్తుపై అనేక సందేహాలున్నప్పటికీ, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బిల్ గేట్స్‌ను ఒప్పించగలిగానని చంద్రబాబు గుర్తుచేశారు.

“ఆనాడు వేసిన బీజాలే ఈనాడు ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారిని కీలక స్థానంలో నిలబెట్టాయి. ఆ దూరదృష్టితోనే నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాధాన్యాన్ని గుర్తించాం.

దీని ఫలితంగానే, అమెరికా బయట గూగుల్ తన అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది” అని ఆయన వివరించారు.

భౌగోళిక రాజకీయ మార్పులు, వాతావరణ సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే పక్కా ప్రణాళిక, విజన్ తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.

టెక్నాలజీని కేవలం అభివృద్ధి కోసమే కాకుండా, ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడానికి, వారిని ఆపదల నుంచి కాపాడటానికి వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

“ఇటీవల రాష్ట్రాన్ని తాకిన ‘మొంథా’ తుపాను సమయంలో టెక్నాలజీ ఆధారిత రియల్-టైమ్ గవర్నెన్స్ ద్వారా కచ్చితమైన అంచనాలు వేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగాం అన్నారు.

వ్యాపార నిర్వహణలో వేగానికి ప్రాధాన్యమిస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు అన్నారు.

ఈ విధానాల ఫలితంగానే కేవలం ఏడాది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు.

“భారత్ తన 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసం నాకుంది” అని ఆయన అన్నారు.

వాతావరణ మార్పులు ప్రపంచానికి అతిపెద్ద సవాలని, ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తితో దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్ తరాలకు మంచి ప్రపంచాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా, పురస్కారాలు అందుకున్న తన సతీమణి నారా భువనేశ్వరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Related posts