కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక పక్క కరోనా మరోపక్క ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసులసంఖ్య 3 లక్షల మార్క్ దాటింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. నిన్న ఒక్క రోజు 3,17,532 కరోనా కేసులు నమోదవ్వగా, 491 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా మహమ్మారి నుంచి 2,23,990 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 19,24,051 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. రికవరీ రేటు 93.69 శాతంగా నమోదైందని పేర్కొంది.
అలాగే..దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి ప్రస్తుతం 9,287 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 43,697 కరోనా కేసులు నమోదవ్వగా, కర్ణాటకలో 40,499 కరోనా కేసులు, కేరళలో 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
మరోపక్క..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,59,67,55,879 మందికి టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 73,38,592 టీకా డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.