మియాపూర్-ప్రశాంత్నగర్ ప్రధాన రోడ్డు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి భారీ గుంత ఏర్పడింది. 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతులో ఏర్పడిన ఈ గుంత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. వారి అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.ఈ గుంత రోడ్డు సమీపంలోనే ఓ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉంది. ఈ ప్రధాన రహదారి పై నుంచి 25 కాలనీలకు వాహన దారులు రాకపోకలు సాగిస్తుంటారు.
అధికారులు వెంటనే ఆ రోడ్డులో రాకపోకలు బ్లాక్చేసి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ భారీ పైపులైను నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గుంతకు సమీపంలోనే మరో చోట కూడా రోడ్డు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు ముందుగానే గుర్తించిన అధికారులు అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.