ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న చర, స్థిరాస్తులన్నింటినీ జప్తు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం కుంభకోణం ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిందని సిట్ తన విచారణలో గుర్తించింది.
సుమారు రూ. 54.87 కోట్ల నల్లధనాన్ని అధికార అండతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు సిట్ నిర్ధారించింది.
ఈ మేరకు సిట్ చేసిన విజ్ఞప్తి ఆధారంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి చర్యలు చేపట్టాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.


టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్