గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాగునీటి రంగం పూర్తిగా ధ్వంసమైందని, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దానిని తిరిగి ప్రగతి పథంలోకి తెస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ పాలనలో ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. 2014-19 మధ్య చేపట్టిన పనులను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశారని నిమ్మల దుయ్యబట్టారు.
ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పులిచింతల, గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో సాగు దిగుబడి తగ్గి రైతులు వలసబాట పట్టారని అన్నారు.
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జులై నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు ఏడాదిలోనే రూ.1,900 కోట్లు అందించామని, 2026 నాటికి పునరావాస కాలనీలు పూర్తి చేస్తామన్నారు.
అదేవిధంగా రూ.3,870 కోట్లతో ఏడాదిలో హంద్రీనీవా పనులను పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును కూడా 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
దెబ్బతిన్న శ్రీశైలం, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు ఇప్పటికే నిధులు విడుదల చేశామని వివరించారు.


కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీడీఓ సస్పెన్షన్!