ఊహంచని స్థాయిలో బంగారం ధర పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో రూ.50 వేలు దాటే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్ అంచనా వేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మదుపరుల్లో గుబులు రేపుతోంది. దీంతో ఇతర వాటితో పోలిస్తే బంగారంపై పెట్టుబడులు పెట్టడం మేలని భావిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ఊపందుకోవడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా రెండు రోజుల క్రితం 42 వేల మార్క్ దాటిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.43 వేల వద్ద కొనసాగుతోంది. అయితే, ఇది ఇక్కడితో ఆగిపోదని, రూ.50 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.కోవిడ్-19 కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయం వంటివి బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని కమోడిటీ విశ్లేషకులు చెబుతున్నారు.