ఈసారి ఎండలకు తీవ్రమైన ఉష్ణోగ్రతలతో మానవులే కాదు.. గుడిలో ఉన్న దేవుడికి తిప్పలు తప్పడంలేదు. గర్భగుడిలో ఉన్న వినాయకుడి విగ్రహానికి వేడి వల్ల చెమటలు పడుతున్న ఘటన బిహార్లోని గయాలో రాంశిలక్ తకుర్బాదీ ఆలయంలో జరిగింది. ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి ఆలయాధికారులు స్వామివారి విగ్రహానికి చందనపు పొడిని పూస్తున్నారు. ప్రతిమను చల్లబరిచేందుకు ప్రత్యేకంగా రెండు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. వేడి వల్ల వెలువడుతున్న తడిని ఎప్పటికప్పుడు తుడుస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఏకదంతుడి విగ్రహం నుంచి చెమట వస్తోందన్న విషయం వ్యాప్తి చెందడంతో ఆలయానికి భక్తుల రాక రెట్టింపైంది.
ఆలయ పూజారులు, గయాలో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలతోపాటు దేవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. విగ్రహం నుంచి స్వేదం రావడానికి శాస్త్రీయ కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. పగడపు వంటి శిలతో గణేశుడిని తయారు చేశారని.. ఈ రాయి ఎప్పుడూ వెచ్చగా ఉండడం దాని స్వభావం అని చెబుతున్నారు. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఇలాంటి విగ్రహాల నుంచి తడి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. శాస్త్రీయ కారణాలు ఎన్ని ఉన్నా వినాయకుడి విగ్రహాన్ని చల్లబరించేందుకు ఆలయ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.