ఫ్లిప్ కార్ట్ లో అనేకసార్లు వాల్ మార్ట్ పెట్టుబడులు పెట్టి వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ మరో 1.2 బిలియన్ డాలర్లను వాల్ మార్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఈ పెట్టుబడితో సంస్థ విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా, ఈ పెట్టుబడి సంస్థకు రానుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ నిధులతో తమ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను కొనసాగిస్తామని తెలిపింది.
కరోనా కష్టాల నేపథ్యంలో ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఇండియాలో నానాటికీ విస్తరిస్తున్న వేళ, మరింత మార్కెట్ వాటాను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపింది. 2018లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో 70 శాతం వాటాలను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ స్టార్టప్ సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్, ఆపై ఇండియాలో అమెజాన్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది.

