ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్బాస్’ సీజన్ 3కు ఈ ఆదివారం (నవంబర్ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్బాస్’ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే గతవారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేషన్ ప్రక్రియలు ఉండవు. శ్రీముఖి, బాబా భాస్కర్, అలీరెజా, రాహుల్, వరుణ్ సందేశ్లు ఫైనల్కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరనే దానిపై ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే గ్రాండ్ ఫినాలేకు రెండు రోజుల ముందు హౌస్మేట్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. పాత సభ్యులందరినీ ఇంట్లోకి పంపించారు. రవి, జాఫర్, అషు, రోహిణి, తమన్నా, పునర్నవి, వితిక, శివజ్యోతి, హిమజ, హేమ హౌస్లోకి వెళ్లి తమ మిత్రులను కలిశారు.
మొదట రవి ఇంట్లోకి అడుగుపెట్టగా ఆ తర్వాత జాఫర్ వచ్చారు. జాఫర్ రాకతో బాబా భాస్కర్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇద్దరు చిన్నపిల్లల్లా ఆనందక్షణాలు గడిపారు. ఇక అషు రెడ్డి, రోహిణి వీళ్లిద్దరూ కలిసి కట్టుగా హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరిని పలకరిస్తూ పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఇంతలో తమన్నా సింహాద్రి హాట్ డ్రెస్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో ఇంట్లో కొత్త సందడి నెలకొంది. మధ్యాహ్నాం సమయంలో పునర్నవి, వితికా కలిసి ఎంట్రీ ఇచ్చారు. భర్తని చూసిన ఆనందంలో వితికా ఉంటే, చాలా రోజుల తర్వాత మళ్ళీ రాహుల్ని కలవడం పునర్నవికి చాలా సంతోషాన్ని కలిగించింది. భర్తని కోర్డ్ యార్డ్లోకి తీసుకెళ్లి బయట ముచ్చట్లు చెబుతూ గోరు ముద్దలు తినిపించింది వితికా. తన భార్య చెప్పే ముచ్చట్లు వింటూ సంతోషంగా మధ్యాహ్నా భోజనం పూర్తి చేశాడు వరుణ్. కొద్ది సేపటి తర్వాత శిల్పా చక్రవర్తి, శివజ్యోతి, మహేష్ విట్టా హౌస్లోకి వచ్చారు. వీళ్ల ముగ్గిరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అయితే, మహేష్ చెప్పినట్టుగా తాను ఫైనల్కు వెళ్లానని.. అందుకని టిక్కెట్ టు ఫినాలేను మహేష్కి ఇస్తున్నానని చెబుతూ టికెట్ టూ ఫినాలే షీల్డ్ను బాబా భాస్కర్.. మహేష్కి ఇచ్చారు.
ఇక చివరిగా హేమ, హిమజ ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్క నువ్వు తోపు అని హేమని ఆటపట్టించారు. హిమజనేమో బాబీ డాల్లా రెడీ అయి వచ్చిందని పంచ్లు వేశారు. మొత్తానికి బయటకి వెళ్ళిన హౌజ్మేట్స్ అందరు మళ్ళీ తిరిగి రావడంతో హౌజ్ కళకళలాడింది. వీరందరికి బిగ్ బాస్ ఏవీ చూపించారు. పాత జ్ఞాపకాలన్నింటిని నెమరువేసుకున్నారు. ఏవీ చూసిన తర్వాత తమన్నా ఎమోషనల్ అయి రవికృష్ణకి సారీ చెప్పింది. నేను నీతో తప్పుగా ప్రవర్తించాను. ఇది నా గేమ్ స్ట్రాటజీ అని చెప్పింది. అందరి ముందు క్షమాపణలు చెప్పినందుకు రవి కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో ఉన్న అందరికీ బిగ్ బాస్ ఒక్కో పత్రాన్ని అందజేశారు. రాత్రి జరిగే అవార్డుల ఫంక్షన్కు సంబంధించి ఆ పత్రాల్లో ప్రతి సభ్యుడు ఎవరికీ తెలియకుండా నింపాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను స్టోర్ రూంలో పెట్టేయాలి అన్నారు. ఇక జాఫర్ హోస్ట్గా నైట్ పార్టీ మొదలైంది. అంతలోనే 104వ ఎపిసోడ్కి బ్రేక్ పడింది. ఈ రోజు పార్టీ హంగామా ఉండనుండగా, నాగ్ రేపటి ఎపిసోడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.