కరోనా లాక్డౌన్ సమయం నుంచి సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని నంబర్ల నుంచి ఫోన్ వస్తే.. మీరు ఫోన్ లిఫ్ట్ చేశారంటే అంతే సంగతలు అంటున్నారు పోలీసులు.. సైబర్ నేరగాళ్లు ఉపయోగించే నంబర్లను గుర్తించిన సైబరాబాద్ పోలీసులు.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆ నంబర్లతో కూడిన ఓ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు.. ముఖ్యంగా +92, +1, +968, +44 పాటు +473, +809, +900 సిరీస్లతో కూడిన ఫోన్ నంబర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే, ఎవరికైనా ఈ సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ వచ్చినపుడు తెలియకుండా ఫోన్ తీస్తే మాత్రం మీ సమస్త సమాచారం గల్లంతుకావడం ఖాయమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఓ వీడియోను రూపొందించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రోజు రోజుకూ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు టెలీకాం, సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, +92, +1, +968, +44 నంబర్ సిరీస్లతో ఎక్కువగా నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్ వంటి ఖాతాలపై కన్నేసిన నేరగాళ్లు కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి ఫ్రెండ్స్ లిస్టులోంచి కొన్ని ఫొటోలను సేకరిస్తారు. ఆ తర్వాత మోసపూరిత నంబర్లను ఆయా వ్యక్తుల ఫొటోలతో సేవ్ చేస్తారు. ఆ ఫేస్బుక్ ఖాతా ఉన్న వ్యక్తికి ఫోన్ చేస్తారు. స్నేహితుడు, స్నేహితురాలి ఫొటోతో ఫోన్ రావడంతో సదరు వ్యక్తి నంబర్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అలా చేయగానే అతని ఫోన్లోని సమస్త సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. అలా అత్యాధునిక టెక్నాలజీతో మోసపూరిత ఫోన్లు, వాట్సాప్ ఫోన్లు చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులు, టెలీకాం సంస్థల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఫోన్, వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు.
previous post
next post