వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మండలి కార్యదర్శికి రాజీనామా లేఖలను అందజేశారు. గత నెల 19న జరిగిన రాజ్యసభకు వీరు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలుగా వారిద్దరు సీఎం జగన్ కేబినెట్లోనూ కొనసాగుతోన్న విషయం విదితమే. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన 14 రోజుల్లోగా తమ పదవులకు వారు రాజీనామా చేయాల్సి ఉండడంతో ఎమ్మెల్సీ పదవుల రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు.
ఎమ్మెల్సీ పదవుల రాజీనామా లేఖలకు ఆమోద ముద్ర పడింది. అలాగే, మంత్రి పదవుల రాజీనామా లేఖలను సీఎం జగన్కు పంపారు. వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా చాలా సంతృప్తిగా పని చేశానని ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు చెప్పారు. తన శాఖకు సంబంధించి సీఎం జగన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. జగన్ తనకు తన శాఖ విషయంల పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు.