ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. ఆయన కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు స్వగృహానికి బయలుదేరారు. ఇక వేణుమాధవ్ మృతిని నిర్దారించిన ఆయన సోదరుడు గోపాలకృష్ణ 2 గంటలకు వేణుమాధవ్ మృత దేహాన్ని కాప్రా Hb కాలనీ, మంగాపురంకి తరలించారు. వేణుమాధవ్ మృతితో కాప్రాలో విషాధచాయలు అలుముకున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఫిల్మ్ చాంబర్ కి వేణుమాధవ్ మృతదేహాన్ని తీసుకురానున్నారు. అభిమానుల సందర్శనార్ధం రెండున్నర గంటల వరకు ఉంచి మౌలాలిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాల వలన ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు వేణు మాధవ్. చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు.
previous post