అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ చేశారు.
నిన్న అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లో ఆర్మీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. అది ఉద్రిక్తతలకు దారి తీయగా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్ అనే యువకుడు చనిపోయాడు. రాకేశ్ కొన్ని నెలలుగా ఆర్మీలోకి వెళ్లేందుకు ట్రైనింగ్ అవుతున్నాడు. ఈ మధ్య జరిగిన పరీక్షల్లో కూడా పాల్గొన్నాడు. ఆ రిక్రూట్మెంట్కు సంబంధించిన వివాదంలోనే సికింద్రాబాద్లో విధ్వంసం జరిగింది.
ఆ ఉద్యోగాల కోసమే ఆందోళనలో పాల్గొని ఇలా పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. రాకేశ్ తండ్రి కుమార స్వామి దబీర్పేటలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. రాకేశ్ సోదరి సంగీత ఇప్పటికే సైన్యంలో పని చేస్తున్నారు. ఆమె పశ్చిబెంగాల్లోని బీఎస్ఎఫ్ జవాన్గా ఉన్నారు. ఆమె స్ఫూర్తితోనే ఆర్మీలోకి వెళ్లాలని భావించాడు రాకేశ్. కానీ ఇలా ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమంలో కన్నుమూశాడంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

