టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా వివిధ బాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన ఆయన సినిమా కోసమే పుట్టారేమో అంటూ తెలుగు పరిశ్రమలో వారు అంటూ ఉంటారు.
గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతు గౌతమ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ కుటుంబానికి తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలను మెగాస్టార్ చిరంజీవి గారు తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా అందజేశారు.
ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబానికి చెప్పమన్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా వెల్లడించారు.