ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పలు కీలక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం, మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ.690 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం పాల్గొంటారు.
పర్యటనలో భాగంగా శుక్రవారం ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు (జింకానా) అందించిన రూ.100 కోట్ల భారీ విరాళంతో ఈ భవనాన్ని నిర్మించారు.
ఈ కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.27 కోట్లు కేటాయించింది.
గుంటూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కుప్పం పయణమవుతారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
తొలి రోజు మధ్యాహ్నం 2:35 గంటలకు కుప్పం చేరుకుని రూ.3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభిస్తారు.
అనంతరం రూ.10 కోట్లతో నిర్మించనున్న ‘లెర్నర్స్ అకామిడేషన్’ సెంటర్కు, రూ.2 కోట్లతో చేపట్టే ఓబెరాయ్ విజిటర్స్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు.
వీటితో పాటు ఆదిత్య బిర్లా మల్టీ-స్కిల్ సెంటర్ను, పర్యాటక అభివృద్ధిలో భాగంగా కాంగుంది హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్క్, పున్నమి రిసార్ట్లను ప్రారంభిస్తారు.

