సోషల్ మీడియాలో తమపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాత్రికేయులకు పవర్ పాయింట్ ద్వారా ప్రజంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై ఎలా ప్రచారం చేస్తున్నారో చూడండి అంటూ కొన్ని క్లిప్పింగ్స్ ను మీడియాకు చూపించారు. ఈ క్రమంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను కూడా ఏకరవు పెట్టారు.
కోడెలపై వచ్చిన ఫర్నిచర్ ఆరోపణలతో వరుసగా ట్వీట్లు చేసి విజయసాయిరెడ్డి రెచ్చగొట్టాడని ఆరోపించారు. సహించలేనంత పదజాలంతో ట్వీట్లు చేసి చివరికి కోడెల ఆత్మహత్యకు కారకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష రూపాయల ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోడెల లేఖ కూడా రాశారని, అయినా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. కానీ, రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ మిమ్మల్నేం చేయాలంటూ నిప్పులు చెరిగారు.