బ్రెజిల్లోని అమెజాన్ నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 18 మంది మరణించారు. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ.. అమెజాన్కు చెందిన జారి ఉపనదిలో బోల్తాపడింది. 46 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఎంత మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారన్న విషయాన్ని ప్రకటించలేదు.
గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, విమానాలు, డైవర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటన పట్ల బ్రెజిల్ నేవీ విచారణ మొదలుపెట్టింది. రెండు బోట్లు పక్కపక్కన రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. క్షణాల్లోనే బోటు మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.