బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ వ్యక్తి సీఎంగా ఉంటే ఆయన కాళ్లు పట్టుకునే నేతలు కొందరున్నారని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వాళ్ల కాళ్లు పట్టుకోవడంతో పాటు అవసరమైతే కాళ్లు కూడా లాగేస్తారంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ…ఆయన మొదటిసారిగా తెలుగులోనే మాట్లాడి ఆకట్టుకున్నారు. ఏ పార్టీ వ్యక్తి సీఎంగా ఉంటే ఆయన కాళ్లు పట్టుకునే నేతలు కొందరున్నారని చెప్పారు. చంద్రబాబు మొదలుకొని వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి ల కాళ్లు పట్టుకున్న వారు ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తెలుగు బాగా నేర్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు సూచించారని.. గవర్నర్ ప్రసంగం బాగుందని, కొన్ని అంశాల్లో తనకు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలి కానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు. కేసీఆర్ కిట్ పథకం బాగుందని, అందులో రాష్ట్ర వాటా ఎంత..? కేంద్ర వాటా ఎంత..? అనే వివరాలు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కంటివెలుగు పథకంలో ఎంతమందికి ఆపరేషన్లు అవసరం అనేది చెప్పకపోవడంతో చాల మంది కాళ్ళ జోడుల కోసం తిరుగుతున్నారని రాజాసింగ్ తెలిపారు.