హత్య కేసులో ఓ బీజేపీ మంత్రి కొడుకుకు కోర్ట్ జీవితఖైదు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి తుమ్కే టాగ్రా కొడుకు కజుం బాగ్రా 2017లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో దోషిగా తేలాడు. 26 మార్చి,2017న కెంజుం కాంసీ అనే వ్యక్తిని మంత్రి కొడుకు ఓ హోటల్లో తుపాకితో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. కాంట్రాక్టు చెల్లింపు విషయంలో చోటుచేసుకున్న వివాదమే ఇందుకు కారణంగా వెల్లడించారు.
ఈ హత్య సీసీ కెమెరాలతో సైతం రికార్డ్ అయింది. హత్యానేరం(సెక్షన్ 302), ఆయుధాల చట్టం(సెక్షన్27(1)) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పలు విచారణల అనంతరం జిల్లా న్యాయస్థానం మంత్రి కొడుకుని దోషిగా తేల్చుతూ తీర్పును వెలువరించింది. హత్య జరిగిన సమయంలో తుమ్కే టాగ్రా శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. జీవిత ఖైదు కింద దోషిగా తేలిన వ్యక్తి కనీసం 14 ఏళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.