తెలంగాణలో వైద్య సిబ్బంది పై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతున్నాయి. మొన్న నిజామాబాద్లో దాడులు జరిగాయి.. నిన్న ఆదిలాబాద్లో జరిగాయి. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం జరిగింది. దీంతో ఆశా కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ, కబూతర్ కాలనీల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన ఆశా కార్యకర్తలపైకి కొన్ని కుటుంబాలు గుంపులుగా దూసుకువచ్చాయి. దీంతో ప్రాణ భయంతో ఆశా కార్యకర్తలు అక్కడి నుంచి తప్పించుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఓ వర్గానికి చెందిన కుటుంబాలన్నీ కలిసి దాడిచేయడానికి వచ్చాయని వారు వాపోయారు.