ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలకాలని నితీశ్ కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యుల బలముందన్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనుండగా తొలి రోజునే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం హరివంశ్ నారాయణ్ సింగ్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. ఈ ఏడాదితో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన బరిలోకి దిగారు.