మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అదృశ్యమైనట్లు పోస్టర్లు వెలిశాయి. భోపాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. స్థానిక ఎంపీ కనిపించడం లేదని పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎంపీ.. భోపాల్లో లేకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని భోపాల్లో 1400ల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమలేశ్వర్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఓటేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. పార్లమెంట్కు ఎన్నికైన తర్వాత ఆమె ప్రజలకు అందుబాటులో లేకుండాపోయిందని ఆయన మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారీ స్పందించారు. ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం ఎయిమ్స్లో కంటి చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆమెకు క్యాన్సర్ కూడా ఉందని, దానికి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పారు. భోపాల్ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కొఠారీ మండిపడ్డారు.