ఏపీ, తెలంగాణ జలవివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ, తెలంగాణ జల వివాదం పరిష్కంచాలని ప్రయత్నం చేస్తే దాన్ని అందరూ తప్పు పట్టారని.. జలం వివాదం కమిటీ పరిష్కరిస్తుందని తెలిపారు.
నీటి విషయంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడతామని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని వెల్లడించారు.
బీఆర్ఎస్ వాళ్లు మళ్లీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని.. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానం వస్తోందని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్ జల్సాలు చేశారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఏ గ్రామానికైనా వస్తా బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపై చర్చిద్దామని.. ఇందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. రెండు పార్టీల నేతలు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలే తమ ప్రచార కర్తలని తెలిపారు.
గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వడంలేదని.. గ్రామీణ వ్యవస్థ సర్వనాశనం అవుతోందని అన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్టైందంటూ వ్యాఖ్యలు చేశారు.
రేపు (శనివారం) రైల్వే కేంద్ర మంత్రి వస్తున్నారు వ్యాగన్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని స్కామ్లు పక్కకు పోయాయని.. ఏ ఒక్క స్కామ్లోనూ కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
రెండు పార్టీలు ఒక్కటే అని.. ‘నువ్వు కొట్టినట్టు చెయ్ నేను ఏడ్చినట్టు చేస్తా’ అనే ధోరణిలో ఉన్నారంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేశారు.
బీసీలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 42 శాతంలో 10 శాతం ముస్లింలే ఉన్నారని.. ఇప్పటికే ఉన్న 23 శాతంలో అదనంగా ఇచ్చేది ఐదు శాతమే అని అన్నారు.
బీసీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ప్రజాప్రతినిధులు కావాల్సిన బీసీల స్థానాల్లో ఎంఐఎం వాళ్లు అయ్యారన్నారు.
ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని.. దాంట్లో ముస్లింలను కలపొద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు.