సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. రాజకీయ చతురత ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా బలమైన అభ్యర్థులకు కొదవలేదని భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్పై పట్టు సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వైపు అధిష్టానం దృష్టి సారించింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పై అజార్ను పోటీకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన కాదంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ను బరిలోకి దింపాలని యోచిస్తోంది.
చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా, నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్కు టికెట్ దక్కే అవకాశం ఉంది. మహబూబ్నగర్ నుంచి ఈసారి ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఈసారి భువనగిరి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, జహీరాబాద్ నుంచి మదన్ మోహన్ రావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాల సమాచారం.