బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు . రైతుల్ని, దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నా..టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని విజయశాంతి పేర్కొన్నారు
ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరిక సందర్బంగా మునుగోడులో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు. మునుగోడు నుంచే కేసీఆర్ పాలనకు అంతం పలుకుతామన్నారు.
మోడీ కేసీఆర్కు శత్రువని.. ప్రజలకు మిత్రుడని విజయశాంతి అన్నారు. సీబీఐ, ఈడీ అంటే కేసీఆర్కు లోలోపల భయమని ఆమె సెటైర్లు వేశారు.
కేసీఆర్ ఎనిమిదేళ్లలో ఏం చేశారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కొట్లాడతానని ప్రజలను నమ్మించి.. అధికారం వచ్చాక కుటుంబానికే పదవులు ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భావ సమయంలో దళిత బిడ్డను సీఎం చేస్తానని చెప్పి.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాత ప్రాజెక్టుకే కొత్త పేరు పెట్టి వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు.
కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ నాయకుల్ని వేరు చేయలేదరని విజయశాంతి అన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం అని విజయశాంతి వెల్లడించారు