telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాక్ విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు… పాక్ నటి

ayeza

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జనావాసాల మధ్య ఫ్లైట్ కూలిపోవడంతో నష్టం భారీగా సంభవించింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో ఉన్న దాదాపు 97 మంది మరణించినట్లు తెలుస్తొంది. అయితే జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. ఇప్పటివరకు 37 మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు సింధ్ ఆరోగ్య మంత్రి అజ్రా పెచుహో తెలిపారు. విమానం దాని రెండు ఇంజన్లను కోల్పోవడం వల్లనే ఇంజిన్‌లో మంటలు చేలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమాన ప్రమాదంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరోవైపు మన దేశ ప్రధాని మోదీ సైతం విమాన ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో రెండు రోజుల్లో రంజాన్ పండగ సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో పాక్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ఘోర ప్రమాదంలో పాక్ సినీ నటి అయేజా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నటి అయేజా ఖాన్ ఖండించారు. తాను బతికే ఉన్నానని తెలిపారు. ప్రమాదానికి గురైన విమానంలో తాము లేమని ఆమె స్పష్టం చేశారు. ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను అయేజా ఖాన్ కోరారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది.

Related posts