ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి హామీ పథకం పనుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు అధమ స్థానానికి పడిపోయిందని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సభ్యులు వీరంకి వెంకటగురుమూర్తి, పోతుగంటి పేరయ్య, మొవ్వ లక్ష్మి సుభాషిణి, సత్రం రామకృష్ణుడు, సురేంద్రబాబు, వినోద్రాజు గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ఉద్దేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పలు రకాల పనుల కోసం మెటీరియల్ కాంపోనెంట్ సరఫరాదారులకు బిల్లులు చెల్లించలేదన్నారు. మూడు దశల్లో రాష్ట్రానికి రావాల్సిన రూ.2,230 కోట్లకు గాను కేంద్రం రూ.1,969 కోట్లు మంజూరు చేసినా, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రశ్నించారు. మార్చి 31 నాటికి మెటీరియల్ కాంపోనెంట్ పెండింగ్లో ఉందన్నారు. అనుసంధానం కింద జరుగుతున్న పనులను నిలిపేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అటవీశాఖ చేపట్టిన పనులు ఆగిపోయి తీవ్ర ఆటంకం కానుందన్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం, ఉపాధి చట్టం నిబంధనలకు విరుద్ధంగా 25 శాతం లోపు పూర్తి అయిన పనులను నిలిపేయాలని ఏపీ సర్కారు ఇచ్చిన ఆదేశాలు పంచాయతీల ప్రగతి, ప్రజల ఉపాధిపై గొడ్డలి పెట్టు అన్నారు.