ఏపీలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి 24కు ముందు రాష్ట్రంలో 8 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా తొలిగించిన గత 20 రోజుల్లో ఏకంగా 4,776 కేసులు నమోదైనట్టు పేర్కొంది. మరోవైపు, రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి.
శుక్ర, శనివారాల్లో 22,371 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక రోజులో ఈ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ పరీక్షల్లో 491 మందికి కరోనా సోకినట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,52,377 మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 8,452 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటి వరకు 4,111 మంది కోలుకున్నారు. 101 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.