కరోనా వైరస్ అన్నీ రంగాలవారిని టచ్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. లాక్డౌన్ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయడంతో కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేసే అవకాశం ఉంది. ఆయన కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. వీహెచ్ ఇటీవల ఎవరెవరిని కలిశారన్న విషయాలపై కూడా అధికారులు ఆరా తీసున్నారు.