అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై .కేంద్రం రైతులకు, ద్రోహం చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు.
రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.
గత యూపీఏ ప్రభుత్వంతో పోలుస్తూ తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసిన మేలును అమిత్ షా (Amit Shah) వివరించారు.
మన్మోహన్ సింగ్ హయాంలో కేవలం రూ. 26,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్, ప్రధాని మోదీ నాయకత్వంలో రూ. 1,29,000 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు.
గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాల సేకరణ పదిహేను రెట్లు పెరిగిందని తెలిపారు. “70 ఏళ్లుగా కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడిందే తప్ప చేసిందేమీ లేదు.
కానీ మా ప్రభుత్వం, రైతులు అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఏటా రూ. 6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది” అని ఆయన అన్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ పాడి రంగం దెబ్బతింటుందన్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు.
ప్రభుత్వం పాడి ఉత్పత్తి రంగాన్ని బలహీనపరచలేదని, మరింత బలోపేతం చేసిందని స్పష్టం చేశారు. అన్ని ఒప్పందాలలోనూ పాడి రంగానికి పూర్తి రక్షణ కల్పించామని పేర్కొన్నారు.
ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఈ చర్చకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

