లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో హైదరాబాద్ నగరంలో వాహనాలు రోడ్డెక్కాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులను తొలగించారు. ప్రజలు ఏ మాత్రం కరోనాపై భయం లేకుండా, తమతమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మాల్స్ మాత్రం తెరచుకోలేదు. వేల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో అన్ని సిగ్నల్స్ వద్దా ట్రాఫిక్ భారీగా కనిపిస్తోంది. పోలీసులు అన్ని ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించడం తప్పనిసరని తెలిపారు. మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని, సాయంత్రం 7 గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తరువాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.