ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సినీ నటుడు అలీ స్పష్టం చేశారు. వైసీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. సోమవారం హైద్రాబాద్ లోటస్పాండ్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో అలీ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయంగా తాను పనిచేస్తానని అన్నారు. వైసీపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాలని జగన్ తనను కోరారన్నారు. జగన్ సూచన మేరకు తాను వైసీపీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తానన్నారు. అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తే తన భవిష్యత్తును జగన్ చూసుకొంటానని చెప్పారని ఆయన తెలిపారు. స్నేహాం వేరు, రాజకీయాలు వేరని అలీ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయితే తాను విజయం సాధించినట్టుగా భావిస్తానని అలీ తెలిపారు.
2004 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ను కలిసి మీరే ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు. నాడు వైఎస్ఆర్ పాదయాత్ర ప్రభావం ప్రజల్లో ఎలా ఉందో ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రభావం కూడ ప్రజల్లో అలాగే ఉందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరు సిటీలోని ఓ స్థానం నుండి పోటీ చేసేందుకు టీడీపీ నుండి తనకు ఆఫర్ వచ్చిన విషయం వాస్తవమేనని అలీ చెప్పారు. స్థానికంగా ఉన్న తమను కాదని అలీకి టిక్కెట్టు కేటాయిస్తే ఊరుకోబోమని స్థానిక నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీలో స్పష్టమైన హామీ లభించనందునే తాను వైసీపీలో చేరినట్టుగా అలీ తేల్చి చెప్పారు.