telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఒక తండ్రిలా అయ్యన్న ఆవేదన – ప్రజలను ఆలోచింపజేస్తోంది!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడిన మాటలు కేవలం ఒక సభాధ్యక్షుడి హెచ్చరికలు మాత్రమే కావు;

అవి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి అంతర్మథనం. ముఖ్యంగా విద్యార్థుల సమక్షంలో నిన్న సభ దిగజారిన తీరును ఆయన వివరించిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది.

సభను చూడటానికి వచ్చిన వందలాది మంది విద్యార్థుల గురించి ఆయన ప్రస్తావించినప్పుడు, ఆయన స్వరం గద్గదమైంది. “ఈ పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు?” అన్న ఆయన ప్రశ్నలో ఒక తండ్రికి ఉండే ఆందోళన కనిపిస్తుంది.

రాజకీయ నాయకులను రోల్ మోడల్స్‌గా చూడాల్సిన భావితరం, సభలో జరుగుతున్న అరుపులు, కాగితాలు చింపి వేయడం చూసి అసహ్యించుకునే పరిస్థితి రావడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది.

ఒక స్పీకర్‌గా సభను హుందాగా నడపాలన్నది ఆయన బాధ్యత. కానీ, వైఎస్ఆర్సిపి సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ, సభా మర్యాదలను కాలరాస్తుంటే, ఆయన అనుభవించిన మనోవేదన వర్ణనాతీతం.

“పసిపిల్లల మనసుల్లో చట్టసభలంటే చులకన భావం ఏర్పడితే, దాన్ని మళ్ళీ మార్చలేం” అని ఆయన అన్నప్పుడు, వ్యవస్థ కూలిపోతుందన్న ఒక రకమైన ‘భయం’ మరియు ‘బాధ’ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి.

జీతభత్యాల కోసం వచ్చి, అలా వికృతంగా ప్రవర్తించి వెళ్లిపోయిన వైఎస్ఆర్సిపి సభ్యులను ఉద్దేశించి, ఈరోజు సభకు రాకున్నా “ఆత్మవిమర్శ చేసుకోండి” అని చెప్పడం వెనుక ఒక పెద్దరికం ఉంది.

అది కేవలం రాజకీయ విమర్శ కాదు, సభ్యులలోని మానవత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం. సభలో మనం ప్రదర్శించే అహంకారం, బయట మనల్ని చూసే సమాజం దృష్టిలో మనల్ని ఎంత చిన్నవారిని చేస్తాయో ఆయన గుర్తుచేశారు.

బయట నుంచి వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణతో కూర్చుని చూస్తూ ఉంటే, లోపల ఉన్న వైకాపా ‘పెద్దలు’ మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం చూస్తుంటే, ఎవరికి క్రమశిక్షణ అవసరమో అర్థమవుతోంది.

అసెంబ్లీని ఒక వీధి పోరాటంగా మార్చేసి, “మేము ఇలాగే ఉంటాం” అన్నట్లుగా వైఎస్ఆర్సిపి వ్యవహరించడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం.

అత్యంత అనుభవజ్ఞుడైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తన కొడుకును లిక్కర్ స్కాములో మందలించలేని అశక్తత ఉండవచ్చు. కానీ అడ్డంగా కొడుకు దొరికిపోయి, జైలులో ఉండి బెయిలు మీద వచ్చాడు.

తట్టుకోలేని తండ్రిగా ‘అత్త మీద కోపం దుత్త మీద’ అన్నట్లుగా, నిన్న ఒక ఆకు రౌడీలా సభలో గవర్నర్ ప్రసంగం ప్రతిని చింపి, దూసుకుని వెళ్లి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు.

అవమానపడిన తండ్రి అక్కసు, వైకాపా సభ్యుల వికృత ప్రవర్తన అక్కడకు వచ్చిన పిల్లల మనసుల్లో ముద్రపడి ఉంటాయి.

అది గమనించిన సున్నిత మనస్కుడైన అయ్యన్న పడిన ఆవేదన ఆంధ్రులను ఆలోచింపజేస్తోంది.

Related posts