కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు ఇటీవల తెరుచుకున్నాయి. హైదరాబాద్లోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు తెరుచుకున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు మళ్లీ విహార యాత్రలకు సిద్దమవుతున్నారు. దీంతో హైదరాబాద్ వాసులు ఉత్సాహంగా పర్యాటక ప్రదేశాలకు వస్తున్నారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో బోటింగ్ ప్రారంభమైంది. పర్యాటక శాఖ బస్సులకు బుకింగ్ కూడా ప్రారంభమైంది. నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు ఈ నెల 6వ తేదీన తెరుచుకోనుంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సందర్శకులను జూ పార్కుకు అనుమతించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. వనస్థలిపురంలోని హరిణస్థలి పార్కు, చిల్కూరు పరిధిలో గల మృగవని నేషనల్ పార్కు సైతం సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి.