టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పర్యాటక జట్టు మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. టీమిండియా ఓడిన తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. కోహ్లీసేనకు హిందీలో పంచ్ ఇచ్చాడు. మా టీమ్తో జాగ్రత్త అని ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా? అని కేపీ హిందీలో ట్వీట్ చేశాడు. గత నెలలో ఆస్ట్రేలియాపై టీమిండియా 2-1తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత కెవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ చేస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన టెస్ట్ సిరీస్ అద్భుతం. అయితే మరీ అంతగా సంబరాలు చేసుకోకండి. రెండు వారాల్లో అసలైన టీమ్ వస్తోంది జాగ్రత్త’ అని గత నెల 19న కేపీ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగానే.. హిందీలో ట్వీట్ చేస్తూ పంచ్ ఇచ్చాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించినప్పుడే హెచ్చరించా. భారత్ ఎక్కువగా సంబరాలు చేసుకోవద్దని. అదే నిజం అయింది ఇప్పుడు’ అని పేర్కొన్నాడు.
తొలి టెస్టు ఓటమిపై టీమిండియా అభిమానులు ఫలితంపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. గత సిరీస్ల్లో తొలి మ్యాచ్ కోల్పోయినా.. భారత్ సిరీస్ సాధించిందని గుర్తు చేస్తున్నాడు. ‘భారత అభిమానులారా.. మీరెవరు బెంగపడకండి. ఆసీస్ టూర్ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్ను గెలిచింది. అంతకముందు స్వదేశంలోనూ తొలి టెస్టు మ్యాచ్ ఓడి ఆ తర్వాత సిరీస్ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉంది. ఒక్కమ్యాచ్ ఓడిపోయినంత మాత్రానా సిరీస్ కోల్పోయినట్టు కాదు.. ధైర్యంగా ఉండండి’ అని ట్వీట్ చేశాడు.